ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం – దర్శనం సమయాలు, వెళ్లే మార్గం, రూమ్స్ & పూర్తి సమాచారం

ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి.  ద్రాక్షారామం ఆలయంలో తెల్లని వర్ణంలో లింగాకారంలో భీమేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి ఈ పుణ్యక్షేత్రంలో యాగం చేయడం వల్ల “దక్షరామం” అనే పేరు ఏర్పడి, కాలక్రమంలో ద్రాక్షారామంగా మారిందని చెబుతారు. ఈ క్షేత్రంలో కొలువైన భీమేశ్వర స్వామివారికి సాక్షాత్తు సూర్య భగవానుడే ప్రథమ పూజలు చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ద్రాక్షారామం ఆలయ దర్శనం సమయాలు, కాకినాడ/రాజమండ్రి/అమలాపురం నుంచి వెళ్లే మార్గాలు, సమీపంలోని రూమ్స్, అన్నదానం, పార్కింగ్ వంటి ఉపయోగకరమైన వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు.

Table of Contents

ద్రాక్షారామం స్థలపురాణం

సతీదేవి తండ్రి అయిన దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా, పుట్టింటిపై ఉన్న మమకారంతో వెళ్లాలని సతీదేవి భావిస్తుంది. తన తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞ కార్యక్రమానికి వెళ్లేందుకు పరమశివుని అనుమతి కోరుతుంది. అలా సతీదేవి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి హాజరవుతుంది.

అక్కడ దక్షుడు తన కోపం కారణంగా సతీదేవిని అవమానిస్తాడు. ఆమెతో రక్త సంబంధీకులు, బంధువులు కూడా మాట్లాడకుండా ఉండటంతో తీవ్ర అవమానభారానికి గురైన సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుని విగతజీవిగా పడిపోతుంది.

ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు దక్షుడి అహంకారాన్ని అంతం చేయడానికి తన కుమారుడు వీరభద్రుడిని పంపుతాడు. అనంతరం దుఃఖభారంతో విగతజీవిగా మారిన సతీదేవిని భుజాలపై మోస్తూ పరమశివుడు ప్రళయ తాండవం చేస్తాడు.

శివుని ప్రళయ తాండవాన్ని ఆపడానికి, ఆయన దుఃఖాన్ని పోగొట్టడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భాగాలుగా చేశారని పురాణ కథనం. ఆ శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో పడిపోవడంతో అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయని చెబుతారు.

ద్రాక్షారామంలో కొలువైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందారు. ఈ వివరాలను ఆలయంలోని అర్చక స్వాముల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయ ప్రధాన ద్వారం
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయ ప్రాకారం ప్రధాన ద్వారం

పంచారామ క్షేత్రం

పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామం “దక్షిణ కాశి”గా పేరుపొందింది. భీమేశ్వర స్వామివారి ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒక ముఖ్యమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

ద్రాక్షారామం ఆలయ విశిష్టత

ఈ ఆలయం చుట్టూ ప్రాకారాలతో, నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో, తూర్పు వైపు పెద్ద తటాకంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడింది. రెండు అంతస్తులుగా ఉన్న ఈ ఆలయం శిలాశాసనాలు, అద్భుతమైన శిల్ప సంపదతో భక్తులను ఆకట్టుకుంటుంది.

రెండవ అంతస్తులోకి వెళ్లి శివలింగం చివరి భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. పైభాగంలోనే అర్చక స్వాములు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తుంటారు. క్రింది భాగాన్ని “చీకటి కోణం” అని పిలుస్తారని ఆలయంలోని వివరాలను బట్టి తెలుస్తుంది.

9వ శతాబ్దంలో చాళుక్య రాజు భీముడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తుంది. ఆలయ క్షేత్రపాలకుడిగా లక్ష్మీనారాయణ స్వామివారిని, శ్రీరామలింగేశ్వర స్వామివారిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ప్రతిష్ఠించినట్లు దేవాలయంలోని వివరాలను బట్టి తెలుస్తుంది.

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, తరువాత కాలంలో 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు దర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఆలయంలోని వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్టడంగా సంరక్షించబడుతోంది.

ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం తూర్పు వైపు దృశ్యం
తూర్పు వైపు నుంచి కనిపించే ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయ దృశ్యం

ఆలయంలో భక్తులు దర్శించుకునే ముఖ్య ప్రదేశాలు

నాలుగు వైపులా ద్వారాలు ఉన్నప్పటికీ, భక్తులు ఆలయ ప్రవేశాన్ని దక్షిణ వైపున ఉన్న ప్రధాన ద్వారం ద్వారా చేస్తారు. లోపలికి ప్రవేశించిన తర్వాత ముందుగా గణపతిని దర్శించుకుని, తర్వాత క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకుని భీమేశ్వర స్వామివారి దర్శనానికి వెళతారు.

భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఆలయంలో తూర్పు వైపు ఉన్న మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుంటారు.

ఆలయ ప్రాకారం తూర్పు వైపున ఆకర్షణీయమైన నందీశ్వరుడి ఏకశిలా విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది.

ఆలయంలో కనిపించే నాగదేవత విగ్రహాలు, శివలింగం

తూర్పు వైపు రావి చెట్టు, దాని చుట్టూ నాగదేవత విగ్రహాలు, శివలింగం కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న శివలింగానికి ఎదురుగా ఉన్న కోనేరు నుంచి నీటిని తీసుకువచ్చి భక్తులు అభిషేకం చేస్తుంటారు.

ఇక్కడి నుంచి ఎడమ వైపున ఉన్న చిన్న గుడిలో కాలభైరవుడు కొలువై ఉన్నారు. అక్కడి నుంచి ఉత్తరం వైపు ఉన్న రాజగోపురం దగ్గరలో “వాయులింగం” అని పిలిచే లింగానికి భక్తులు పాలతో అభిషేకాలు చేస్తుంటారు.

ద్రాక్షారామం ఆలయ ప్రాంగణంలోని నాగదేవత విగ్రహాలు మరియు రావిచెట్టు
ద్రాక్షారామం ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు వద్ద ఉన్న నాగదేవత విగ్రహాలు

రావి చెట్టు, ఉసిరి చెట్టు

ఈ ఆలయ ప్రాకారంలో రావి చెట్టు, ఉసిరి చెట్టు కూడా ఉన్నాయి. భక్తుల నక్షత్రాలను బట్టి ఈ వృక్షాలకు పూజలు చేయడం వలన వారి జాతకంలోని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబంతో కలిసి వెళ్లి భీమేశ్వర స్వామివారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకోవలసిన పుణ్యక్షేత్రం ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి ఆలయం.

ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం సమయాలు

  • ఉదయం: 6:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు దర్శనం ఉంటుంది.
  • మధ్యాహ్న విరామం: మధ్యాహ్నం 12:00 గంటల నుండి 3:00 గంటల వరకు ప్రధాన ద్వారం మూసి ఉంటుంది.
  • సాయంత్రం: 3:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు దర్శనం ఉంటుంది.

గమనిక: ఈ దర్శన సమయాలను ఆలయంలో ఉన్న అర్చక స్వామివారిని అడిగి తెలుసుకుని ఇక్కడ తెలియజేస్తున్నాను. పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో దర్శనం సమయాల్లో కొంత మార్పు ఉండవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వెళ్లే ముందు ఆలయంలో దర్శన సమయాలను మరోసారి నిర్ధారించుకోవడం మంచిది.

ద్రాక్షారామం ఎక్కడ ఉంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో ద్రాక్షారామం ఉంది.

ద్రాక్షారామం ఎలా వెళ్లాలి?

కాకినాడ నుంచి

కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రామచంద్రాపురం మీదుగా ద్రాక్షారామానికి బస్సు సౌకర్యం ఉంది. కోటిపల్లి వెళ్లే కొన్ని బస్సులు ద్రాక్షారామం మీదుగా వెళ్తాయి.

రాజమండ్రి నుంచి

రాజమండ్రి నుంచి మండపేట, రామచంద్రాపురం మీదుగా ద్రాక్షారామానికి బస్సు సౌకర్యం ఉంది.

అమలాపురం నుంచి

అమలాపురం నుంచి రావులపాలెం మీదుగా ద్రాక్షారామం చేరుకోవచ్చు.

బస్సు / కారులో

కారులో వచ్చే వారికి ద్రాక్షారామానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రావులపాలెం నుంచి వచ్చే వారు జొన్నాడ, కపిలేశ్వరపురం మీదుగా ద్రాక్షారామం చేరుకోవచ్చు. అమలాపురం నుంచి వచ్చే వారు యానం మీదుగా కోటిపల్లి చేరుకుని, అక్కడి నుంచి ద్రాక్షారామం వెళ్లవచ్చు.

రైలులో

రైలులో వచ్చే వారికి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లుగా కాకినాడ, రాజమండ్రి స్టేషన్లను ఉపయోగించుకోవచ్చు.

ద్రాక్షారామం దూరం

  • కాకినాడ నుంచి: సుమారు 28 కి.మీ
  • రాజమండ్రి నుంచి: సుమారు 50 కి.మీ
  • అమలాపురం నుంచి: సుమారు 25 కి.మీ

గమనిక: బస్సుల రూట్లు, సర్వీసుల సంఖ్య, ప్రయాణ సమయాలు మారే అవకాశం ఉంది. ప్రయాణానికి ముందు సంబంధిత బస్సు సర్వీస్ వివరాలను ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.

ద్రాక్షారామం ఆలయం సమీపంలోని ప్రైవేట్ గదులు
ద్రాక్షారామం ఆలయం సమీపంలో భక్తుల వసతి కోసం అందుబాటులో ఉన్న ప్రైవేట్ గదులు

ద్రాక్షారామంలో రూమ్స్

ద్రాక్షారామం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయం చుట్టుపక్కల ప్రైవేట్ రూమ్స్, లాడ్జిలు, డార్మిటరీ వంటి వసతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మేము తెలుసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీ కైలాష్ రెసిడెన్సీ – సూట్ రూమ్స్

  • సౌకర్యం: AC / Non-AC
  • అద్దె: సుమారు ₹800 – ₹1,500
  • Booking విధానం: ఫోన్ ద్వారా
  • స్థానం: ద్రాక్షారామం గుడికి దగ్గరగా, ఎదురుగా సెంటర్‌లోనే ఉంది.
  • Check-in / Check-out: 24 గంటల సదుపాయం
  • ఫోన్: 9347441222, 9052395652

DVS లాడ్జి

  • సౌకర్యం: AC / Non-AC
  • అద్దె: సుమారు ₹800 – ₹1,500
  • Check-in / Check-out: 24 గంటల సదుపాయం
  • Booking విధానం: ఫోన్ ద్వారా లేదా నేరుగా వెళ్లి రూమ్ చూసుకుని బుక్ చేసుకోవచ్చు.
  • స్థానం: ద్రాక్షారామం ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది.
  • ఫోన్: 9290540939, 9032202293

విశ్రాంతి డార్మిటరీ – AC

  • అద్దె: సుమారు ₹150
  • లాకర్: సదుపాయం ఉంది
  • స్థానం: గుడి వెనుక అన్నదాన సత్రం పక్కన
  • ఫోన్: 9247937783, 8523898668

గమనిక: పై రూమ్ అద్దెలు, లభ్యత, సౌకర్యాలు కాలానుగుణంగా మారే అవకాశం ఉంది. రూమ్ బుక్ చేసుకునే ముందు ఫోన్ చేసి ప్రస్తుత ధర, ఖాళీ ఉందో లేదో నిర్ధారించుకోండి.

ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రూమ్ అవసరమైన వారు ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.

ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయంలోని ప్రాచీన తెలుగు-కన్నడ లిపి శిలాశాసనం
ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో కనిపించే ప్రాచీన తెలుగు-కన్నడ లిపి శిలాశాసనం

“ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో వివిధ రాజవంశాల కాలానికి చెందిన అనేక శిలాశాసనాలు ఉన్నాయి. వీటిలో తెలుగు భాష, తెలుగు-కన్నడ లిపిలో చెక్కబడిన శాసనాలు కూడా ఉన్నాయి. ఈ శాసనాలు ఆలయ చరిత్ర, దానధర్మాలు, నాటి సామాజిక–రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలుగా నిలుస్తాయి.”

ఆలయం దగ్గర భోజనం / ఇతర సౌకర్యాలు

ద్రాక్షారామం ఆలయానికి వచ్చే భక్తులకు భోజనం, అన్నదానం, పార్కింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

భీమేశ్వర స్వామి వారి అన్నదానం

ఆలయం బయట ఉత్తరం వైపు ఉన్న ద్వారం బయట భక్తుల కోసం భీమేశ్వర స్వామి వారి అన్నదాన సదుపాయం ఉంది. ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఈ అన్నదాన సదుపాయం అందుబాటులో ఉంటుంది.

పైడా వారి సత్రం

దక్షిణ వైపు ఉన్న ప్రధాన ద్వారం వద్ద, పార్కింగ్ ఏరియా దగ్గర ఎడమ వైపున పైడా వారి సత్రం ఉంది. ఇక్కడ భక్తుల కోసం నిత్యం అన్నదానం జరుగుతుంది.

అన్నదానం సమయం: ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు.

పార్కింగ్

ఆలయం బయట భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి స్థలం ఉంది. పార్కింగ్‌కు నిర్దేశిత రుసుము వసూలు చేస్తున్నారు.

గమనిక: అన్నదానం, పార్కింగ్ సమయాలు మరియు రుసుములు సందర్భానుసారం మారే అవకాశం ఉంటుంది. వెళ్లే సమయంలో అక్కడి సిబ్బందిని ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది..

ద్రాక్షారామం ఆలయం పరిసరాల్లోని తటాకం, ఉసిరి చెట్టు మరియు రావి చెట్టు
ద్రాక్షారామం ఆలయం పరిసరాల్లోని తటాకం, ఉసిరి చెట్టు మరియు రావి చెట్టు

ద్రాక్షారామం FAQ

దర్శనం ఎప్పుడు ఉంటుంది?

ద్రాక్షారామం ఆలయంలో ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు దర్శనం ఉంటుంది.

ద్రాక్షారామంలో రూమ్స్ ఉన్నాయా?

అవును. ఆలయం బయట ప్రైవేటు రూమ్స్, లాడ్జిలు అందుబాటులో ఉన్నాయి.

రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి?

స్వయంగా రూమ్ చూసుకుని బుక్ చేసుకోవచ్చు. లేదా ఫోన్ చేసి మీ వివరాలు నమోదు చేసి ముందుగానే రూమ్ బుక్ చేసుకోవచ్చు.

కాకినాడ నుంచి ద్రాక్షారామం ఎంత దూరం?

కాకినాడ నుంచి ద్రాక్షారామం సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రాజమండ్రి నుంచి ద్రాక్షారామం ఎలా రావాలి?

రాజమండ్రి నుంచి మండపేట, రామచంద్రాపురం మీదుగా ద్రాక్షారామం చేరుకోవచ్చు. దూరం సుమారు 50 కిలోమీటర్లు.

పంచారామాల్లో ద్రాక్షారామం ఏది?

ద్రాక్షారామం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. మిగిలిన నాలుగు క్షేత్రాలు:

  • అమరారామం – అమరావతి
  • కుమారారామం – సామర్లకోట
  • క్షీరారామం – పాలకొల్లు
  • సోమారామం – భీమవరం

ఈ ఐదు క్షేత్రాల్లో ద్రాక్షారామం కూడా ఒక ముఖ్యమైన పంచారామ క్షేత్రంగా అధికారిక జిల్లా పర్యాటక సమాచారంలో పేర్కొనబడింది.

ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వర విగ్రహం
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిచ్చే నందీశ్వర విగ్రహం

ముగింపు

ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన పుణ్యక్షేత్రం. ఆలయ దర్శనంతో పాటు ఇక్కడి చారిత్రక విశేషాలు, ప్రశాంతమైన వాతావరణం భక్తులను ఆకట్టుకుంటాయి. నేను స్వయంగా వెళ్లి చూసి, ద్రాక్షారామం వెళ్లే భక్తులకు దర్శనం సమయాలు, మార్గం, రూమ్స్, అన్నదానం వంటి వివరాలను అందించాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం – అధికారిక సమాచారం :

https://eastgodavari.ap.gov.in/

మా సైట్‌లోని మరికొన్ని ఉపయోగకరమైన కథనాలు

ద్రాక్షారామం సందర్శనతో పాటు కోనసీమలోని ఇతర ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు మరియు ప్రయాణ సమాచారాన్ని తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్‌లోని ఈ కథనాలను కూడా చదవండి:

 

Related Post

Leave a Comment