ప్రకృతి ఒడిలో ఒదిగిన కోనసీమ మణిహారం – కేశనపల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర,ము అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో పచ్చని కొబ్బరి తోటలు, గోదావరి ప్రవాహాలు, ప్రశాంతమైన గ్రామాలు, ప్రకృతి సోయగాలు కళ్లముందు మెదులుతాయి. దేశంలో ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నప్పటికీ, కోనసీమకు ఉన్న ప్రత్యేకత మాత్రం మరెక్కడా కనిపించదు. ఇక్కడ ప్రతి గ్రామం తనదైన అందంతో సందర్శకులను ఆకట్టుకుంటుంది.
అలాంటి గ్రామాల్లో ప్రకృతి ప్రేమికులను మొదటి చూపులోనే మంత్రముగ్ధులను చేసే అందమైన గ్రామం కేశనపల్లి. ఉప్పుటేరుల మ ధ్యలో పచ్చని కొబ్బరి తోటలు, సముద్రపు గాలుల తో , ప్రశాంతమైన గ్రామీణ జీవనం, సినిమా షూటింగ్లకు అనువైన ప్రకృతి దృశ్యాలు… ఇవన్నీ కలిసి కేశనపల్లిని కోనసీమలోని “చిన్న కేరళ” గా నిలబెట్టాయి.
కేశనపల్లి కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు… కోనసీమ సంస్కృతి, ప్రకృతి, వ్యవసాయం, సంప్రదాయ జీవనశైలికి ప్రతిరూపంగా నిలిచిన అందమైన పల్లె. ఈ కథనంలో కేశనపల్లి గ్రామం చరిత్ర, భౌగోళిక విశేషాలు, ప్రకృతి అందాలు, వ్యవసాయం, సినిమా చిత్రీకరణలు, విద్య, వారపు సం
త, బీచ్ మరియు మరెన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

కేశనపల్లి గ్రామం ఎక్కడ ఉంది?
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలానికి చెందిన అందమైన గ్రామం కేశనపల్లి. కోనసీమ దక్షిణ అంచున సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ గ్రామం ప్రకృతి వైవిధ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందింది.
భౌగోళికంగా చూస్తే కేశనపల్లి గ్రామం ఒకవైపు సముద్ర ప్రభావాన్ని, మరోవైపు గోదావరి డెల్టా అందాలను ఒకేసారి ఆస్వాదించే అరుదైన ప్రాంతం.
గ్రామానికి ఒక వైపున కరవాక గోదావరి పాయతో అనుసంధానమైన ఉప్పుటేరులు పొడవుగా ప్రవహిస్తూ గ్రామ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ ఉప్పుటేరుల ఒడ్డున వరుసగా కనిపించే కొబ్బరి తోటలు ప్రతి సందర్శకుడిని ఆకర్షిస్తాయి.
గ్రామ సరిహద్దులు
ఈ గ్రామం చుట్టూ పలు అందమైన గ్రామాలు ఉన్నాయి.
- తూర్పున – తూర్పుపాలెం
- పడమర – పడమటిపాలెం
- ఉత్తరం – గుడపల్లి
- దక్షిణం – బంగాళాఖాతం
ఈ భౌగోళిక నిర్మాణం కారణంగానే గ్రామంలో ఎప్పుడూ చల్లని గాలులు వీచుతూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది.

గ్రామ జీవన విధానం
ఈ గ్రామ ప్రజల జీవన విధానం ప్రకృతి, వ్యవసాయం, సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. కల్మషం లేని అప్యాయంగా పలకరించే మనుషులు మనకు తారస పడతారు . ఎక్కడి ప్రజలు తరతరాలుగా వ్యవసాయం, చేపల వేట, కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం వేళల్లో గ్రామంలోని కాలువల దగ్గర కనిపించే చేపల మార్కెట్ సందడి, రైతులు తోటలకు వెళ్లే దృశ్యాలు, గ్రామీణ వాతావరణం ఈ ప్రాంత ప్రత్యేకతను తెలియజేస్తాయి.
ఇక్కడ ప్రకృతి ఎందుకు ప్రత్యేకం ?
కోనసీమలోని ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. అయితే ఈ గ్రామ ప్ర త్యేకత ఏమిటంటే, ఇక్కడ ఒకే ప్రాంతంలో సముద్ర తీరం , గోదావరి పాయల ప్రభావం, పచ్చని కొబ్బరి తోటలు కనిపిస్తాయి. ఉప్పుటేరుల వెంట ప్రయాణిస్తుంటే నీటిలో ప్రతిబింబించే కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
పర్యాటకులను ఆకర్షించే గ్రామం
ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి కేశనపల్లి ఒక మంచి ప్రదేశం. నగర జీవితంలోని హడావిడి నుంచి దూరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారు ఈ గ్రామాన్ని సందర్శించవచ్చు. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో ఇక్కడి ప్రకృతి దృశ్యాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ఉప్పుటేరులు ( backwaters ) పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి .
ఒకప్పుడు నాలుగు గ్రామాలకు ఒకే పంచాయతీ
నేటి తరానికి ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, 1980 ప్రాంతం వరకు కేశనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెం, గొల్లపాలెం గ్రామాలన్నీ కలిపి ఒకే గ్రామ పంచాయతీగా ఉండేవి.
ఆ రోజుల్లో గ్రామాల మధ్య రాకపోకలు నేటిలా సులభంగా ఉండేవి కావు. ఉప్పుటేరులపై వంతెనలు లేకపోవడంతో గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు ఎడ్లబండ్లపై ప్రయాణించేవారు. వర్షాకాలంలో లేదా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న రోజుల్లో చిన్న పడవలైన బల్లకట్లు మాత్రమే ప్రజలకు ఆధారం.
ఆ రోజుల్లో పిల్లలు పాఠశాలకు వెళ్లాలన్నా, రైతులు మార్కెట్కు వెళ్లాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రికి చేరాలన్నా ఈ పడవలపైనే ఆధారపడాల్సి వచ్చేది. నేటి తరానికి ఊహించలేని ఆ జీవన విధానం అప్పటి గ్రామీణ కోనసీమలో సహజమైన దృశ్యం.
గ్రామ అభివృద్ధికి యనుమల బాపిరాజు గారి సేవలు
కేశనపల్లి గ్రామ అభివృద్ధి గురించి చెప్పేటప్పుడు యనుమల బాపిరాజు గారి పేరు తప్పకుండా గుర్తు చేసుకోవాలి.
గ్రామానికి వంతెనలు నిర్మించడం, విద్యుత్ సౌకర్యం కల్పించడం, పాఠశాలల నిర్మాణానికి కృషి చేయడం, గ్రంథాలయం ఏర్పాటు చేయడం, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి సహకరించడం వంటి అనేక ప్రజా సేవా కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
అందుకే గ్రామ ప్రజలు ఆయన సేవలను గౌరవిస్తూ గ్రామ సచివాలయం సమీపంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఇప్పటికీ గ్రామంలోని పెద్దలను యనుమల బాపిరాజు గారి గురించి అడిగితే, ఆయన గ్రామాభివృద్ధి కోసం చేసిన సేవలను ఎంతో గౌరవంతో గుర్తుచేసుకుంటారు.

ప్రకృతి అందాల్లో కేరళను తలపించే కేశనపల్లి
ఈ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఇక్కడి ప్రకృతి అందాలే.
ఉప్పుటేరుల వెంట వరుసగా నిలిచిన కొబ్బరి చెట్లు, నీటిలో ప్రతిబింబించే పచ్చని తోటలు, చల్లని గాలులు, పక్షుల కిలకిలారావాలు కలిసి ఈ ప్రాంతాన్ని ఒక అందమైన ప్రకృతి చిత్రంలా మార్చేస్తాయి.
ఈ ప్రాంతాన్ని తొలిసారి చూసే చాలా మంది సందర్శకులు…
“ఇది నిజంగా కోనసీమేనా… లేక కేరళలోని అలప్పీనా?”
అని ఆశ్చర్యపోతుంటారు.
ప్రస్తుతం ఇక్కడ పడవ విహారం అందుబాటులో లేకపోయినా, ఉప్పుటేరు ఒడ్డున నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదించడం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది.
కేశనపల్లి బీచ్, వ్యవసాయం, సినిమా చిత్రీకరణ ప్రదేశాలు మరియు సమీప పర్యాటక ఆకర్షణలపై ప్రత్యేక కథనాలకు క్రింద మా వెబ్ సైట్ ను సందర్శించండి.
కోనసీమలోని ప్రసిద్ధ ఆలయాల దర్శన విశేషాలు, ఉత్సవాలు మరియు ప్రయాణ సమాచారాన్ని తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన లింకులను చూడండి.









