కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయ పరిచయం
వాడపల్లి కి ఆ పేరు ఎలావచ్చింది ?
గోదావరి తీరం లో రాజమండ్రి తర్వాత కోనసీమ లోని ప్రముఖ రేవులలో ఈ వాడపల్లి గ్రామం లో నౌకా నిర్మాణ పనులు , నౌకా ల ద్వార వర్తక వానిజ్యములు జరుగు తూ ఉండేవి . పూర్వకాలం ఈ గ్రామాన్ని నౌకాపురం అని పురాణాల ప్రకారం ” నౌకా పురి ” అని పిలిచే వారు . కాల క్రమం లో నౌకాపురం కాస్తా ” ఓడపల్లి ” అని వాడుక బాషలో వాడపల్లి అని మార్పు చెందింది .
పూర్వం ఒకసారి సనక, సనందనాది మహార్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణున్ని దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలుపారు. కలియుగంలో ధర్మంఒంటిపాదంలో నడుస్తోంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యత నిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై, కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు. అందువలన ప్రజల్ని చక్కదిద్ధి ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని మహార్షులు శ్రీ మహావిష్ణువును అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధముగా చెప్పెను.
కోనసీమ తిరుమల వాడపల్లి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , BR అంబేద్కర్ కోనసీమ జిల్లా , ఆత్రేయపురం మండలం లో ఉన్న “వాడపల్లి తిరుమల – కోనసీమలో అద్భుతమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ”

ఆలయ చరిత్ర & ప్రాముఖ్యత
అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించితిని, కాని కలియుగము పాపభూయిష్టమై అధర్మం ప్రభలినది. కలియుగంలో మొదటిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షముగా తదుపరి లక్ష్మీక్రీడాస్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలె దరిచేర్చునదిఅగు దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమీ గోదావరి తీరమున నౌక పురమనెడి (వాడపల్లి) పురమందు అవతరించి భక్తులను ఉద్దరించెదను.
కలియుగ ప్రారంభమున తిరుమలలో శ్రీవారు అవతరించుట జరిగినది. తదుపరి మహర్షులు అందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికాత్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్ర చందనము అనే కొయ్యలో లక్ష్మి సహితంగా అవతరించుట జరిగినది. ఈ మహర్షులందరూ శ్రీవారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామి వారి అజ్ఞమేరకు ఒక చందన వృక్ష పేటికలో ఉంచి గౌతమీ ప్రవాహ మార్గంలో వదిలిన నేను నౌకపురి (వాడపల్లి) క్షేత్రము చేరుకుని భక్తులను అనుగ్రహిస్తాను. ఈ వృతాంతం అంతా నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు.

నౌకాపురం లో స్వామి ఆవిర్బావం
కొంత కాలమునకు నౌకపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరమునకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమై పోవడం ప్రారంభించినది. ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించిన శ్రీవారి యొక్క లీల వారు ఎవరూ కనుగొనలేక పోయినారు. తిరిగి శ్రీవారే భక్తుడైన వృద్ధ బ్రాహ్మణునకు కలలో కనిపించి కలి కల్మషం వల్ల మీరు నన్ను కనుగొనలేక పోతున్నారు. కనుక పురజనులందరూ వేకువనే గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే కృష్ణగరుడ వాలిన చోట నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెబుతారు. పురజనులు శ్రీ స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నదిగర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభించింది. దానిని తీరమునకు తీసుకు వచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖ, చక్ర గదాదారుడై లక్ష్మీ సహితుడైన దివ్యమంగళ విగ్రహం కనిపించింది.
అంతలో అక్కడకి దేవర్షి నారదుడు విచ్చేసినారు. గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్దరించడానికి ఉపాయం చూడవలసినదిగా విష్ణువును ప్రార్ధించడం, విష్ణువు ” నౌకాపురి “లో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలయిన విషయాలు నారదుడు పుర జనులకు వివరించెను. అందులకు నిదర్శనముగా శ్రీ స్వామి వారు కటి హస్తమునకు బదులుగా గదాదారుడై వెలయుట జరిగినది. తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయం కట్టింపజేసినాడు. “ వేం ” అంటే పాపములను ” కట ” అంటే పోగొట్టే వాడు కనుక స్వామికి “వేంకటేశ్వరుడు ” అని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింప చేసినాడు. వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకొని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. ఒకప్పటి నౌకా పురము ఓడపల్లి కాస్త నేటి వాడపల్లి అయినది .
వాడపల్లి తీర్థం అనగా వాడవాడలా ఉత్సవమే. ఆబాలగోపాలానికి ఆనందమే. ప్రతియేటా చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామి వారి తీర్థం, కళ్యాణోత్సవము వైభవముగా జరుగుతాయి.శ్రీ స్వామి వారి పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవ, కళ్యాణోత్సవ కార్యక్రమములను వేలాది మంది భక్తులు కన్నుల పండుగగా భక్తి ప్రవత్తులతో తిలకిస్తారు. ఏటా కళ్యాణంతో పాటు ఏడు శనివారాల వత్రంలో నిత్యం వేలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శిస్తుంటారు
కోనసీమ తిరుమల వాడపల్లి లో దేశ భక్తి రగిల్చిన రధోత్సవం
1931 సంవత్సరం మార్చి నెల 30వ తేది చైత్ర శుద్ధఏకాదశి పర్వదినం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చిరస్మరణీయం. ఆ రోజే మాతృదేశ దాస్యవిమోచనోద్యమ గాంధీమహాత్ముని పిలుపు మేరకు ప్రతిస్పందించిన గోదావరి జిల్లలో కోనసీమ లోని స్వాతంత్య్ర సమరమోధులు బ్రిటిషు పాలకుల నిరంకుశత్వాన్ని సంఘటితంగా ఈ వాడపల్లి లో ప్రతిఘటించారు. తమ ప్రియతమ మహాత్ముని చిత్రపటాన్ని త్రి వర్ణపతాకాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి రధం మీద ఉంచి ఊరేగింపు జరుగుతుండగా బ్రిటిష్ పోలీసులు ఆ జండాను తొలగించారు . కోపోద్రోక్తులైన రధోత్సవం లో పాల్గొన్న భక్తులు మారణహోమానికి పాల్పడిన సాయుధ పోలీసులను దైర్యంగా ఎదురు నిలబడి పోరాడిన దినం అది. ఆ బ్రిటిష్ పోలిసుల పోరాటం లో చాల మంది ప్రాణాలు కోల్పోయారు . ఆ పోరాటం లో ప్రాణాలు కోల్పోఇన వీరుల కోసం ఏర్పాటు చేసిన స్మారక స్తూపం కోనసీమ తిరుమల వాడపల్లి లో నేటికి ఉంది . ఈ పవిత్ర ప్రదేశంలో ఇదే వారి స్మారక చిహ్నం.

వాడపల్లి ఎలా చేరుకోవచ్చు ?
సమీప బస్సు స్టేషన్ : రావులపాలెం . రావులపాలెం నుండి కోనసీమ తిరుమల వాడపల్లి చేరుకోవడానికి ప్రతి అరకంటకు బస్సు లు నడపబడుతున్నవి . రాజమండ్రి నుండి వచ్చే వారు దవేలేశ్వరము , బొబ్బర్లంక రూటు దగ్గరగా ఉంటుంది .సమీప రైల్వే స్టేషన్ : రాజమండ్రి
సమీప ఎయిర్పోర్ట్ : రాజమండ్రి కోరుకొండ లో ఎయిర్పోర్ట్ కలదు .

కోనసీమ తిరుమల వాడపల్లి లో పూజలు & దర్శన వివరాలు
ప్రతీ రోజు ఉ|| 6.00 నుండి 1.00 సా॥ 4.00 నుండి 8.00 ప్రతీ శనివారం ఉ॥ 4.00 నుండి 1.30
సా॥ 4.00 నుండి 9.00
అష్టోత్తర వేళలు
ప్రతీ రోజు ఉ|| 6.00 గం॥ల నుండి అష్టోత్తర పూజ రుసుము రూ॥ 150/-
కావలసిన వస్తువులు :
కొబ్బరికాయలు – 2, అరటిపళ్ళు – 6, అగరవత్తులు – 6, హరతికర్పూరం – 6, విడి పువ్వులు, తులసిమాల, స్వయంపాకం (అర్చకులకు).
వేదాశీర్వచనం రుసుము : రూ॥ 1116/- భక్తులకు దర్శనం, ఆశీర్వచనం, స్వామివారి శేషవస్త్రం, రవికల ముక్క, లడ్డు ప్రసాదం, అక్షింతలు, కుంకుమ, జూట్ బ్యాగ్ స్వామి వారి ప్రసాదంగా అందించటం జరుగుతుంది.
శ్రీస్వామి వారి కళ్యాణోత్సవం
: ప్రతీరోజు ఉ॥ 10.30 నుండి 9.00 గం॥ల వరకు.
శనివారం కళ్యాణములు ,శనివారం అష్టోత్తర పూజలు జరుపబడవు.
శ్రీ స్వామి వారి కళ్యాణం రుసుము : రూ॥ 750/- కావలసిన వస్తువులు :
కొబ్బరికాయలు – 3, అరటిపళ్ళు – 12, తమలపాకులు -అరమోద, పసుపు, కుంకుమ, అగరవత్తులు, హారతికర్పూరం, విడిపువ్వులు, గంధపు డబ్బా (చిన్నది), వక్కలు, తేనె సీసా (చిన్నది), ఆవు పాలు – 100ml, బియ్యం – 3 కేజీలు.
నిత్య అన్నప్రసాదం : ప్రతీ రోజు ఉదయం గం॥ 10.00 ని॥ల నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు.మీరు చెల్లించే 500/- రూ. విరాళంతో 10 మంది సాటి భక్తులకు అన్నప్రసాదం ” అందించండి, సంతృప్తి పొందండి.
గమనిక: శనివారం మరియు వార్షిక ఉత్సవముల సందర్భములలో ఆర్జిత సేవలు రద్దు.
కోనసీమ తిరుమల వాడపల్లి దర్శనం – ఏడేడు జన్మల పుణ్యఫలం
స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని వరుసగా “ 7 ” శనివారములు దర్శించినచో భక్తుల కోర్కెలు నెరవేరును అని ప్రతీతి. ప్రారంభించే మొదటి శనివారం ధ్వజస్థంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను ఆ స్వామివారికి నివేదించుకుని ‘ 7 ‘ సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవలెను. భక్తులకు ఆలయమున కు రాకూడని అడ్డంకి కలిగినచో అడ్డంకి తొలగిన తదుపరి వారములు కొనసాగించవచ్చును. “ 7 ” శనివారములు వాడపల్లి వెంకన్న దర్శనం అనంతరం మీ యొక్క జన్మ నక్షత్ర రీత్యా సాధన తార, తిధి రోజున శ్రీ స్వామి వారికి అష్టోత్తరం, శాంతి కళ్యాణం జరిపించిన కొరిన కోరిక సిద్ధించి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని భక్తుల విశ్వాసం. ఇది కోనసీమ తిరుమల – వాడపల్లి విశేషం .
ముగింపు
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి గోదావరి జిల్లా ల నుండే కాకుండా ఇతర జిల్లాల వారు , ఇతర రాష్ట్రాల వారు నిత్యం వందలాది భక్తులు వస్తుంటారు . శని వారం అయితే సుమారు 50 వేల నుండి లక్ష మంది ఆ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు .
చాల మంది భక్తులు తమ కోరిన కోర్కెలు తీరిన తర్వాత ఏడూ శనివారాలు స్వామి వారి ప్రదక్షిణ చేయడం తో శనివారం ఈ దేవాలయం భక్తులతో రద్దీగా ఉంటుంది . శనివారం కాకుండా మిగతా రోజుల్లో దర్శనం కొంచెం త్వరగా అవుతుంది . ఇక్కడికి వచ్చే భక్తుల కోసం దేవాలయం లో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది . మీరు వీలయినప్పుడు కోనసీమ లోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి ని దర్శించు కొండి !
మా వెబ్ సైట్ లోని కొన్ని ఆర్టికల్స్ చదవండి : అంబాజీపేట పోట్టిక్కలు
కొత్త పేట మండలం , పలివెల గ్రామం లో ఉన్న పురాతన శివాలయం స్టొరీ
అయినవిల్లి గణపతి ఆలయం ఈ వీడియోలోచూడండి : అయినవిల్లి గణపతి ఆలయం
మరిన్ని వివరములకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కోనసీమ తిరుమల – వాడపల్లి
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి, ఆత్రేయపురం మండలం, డా॥బి.ఆర్. అంబేధ్కర్ కోనసీమ జిల్లా,
+918855 271888 +91 94910 00085
మరిన్ని వివరములకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వారి వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు : www.vsvstemple.com
ప్రభుత్వ వెబ్ సైట్ : aptemples.ap.gov.in
Meovdpl@gmail.com
Konaseema
Tirumala Vadapalli









