అయినవిల్లి వినాయకుని మహిమ & ప్రాముఖ్యత
అయినవిల్లి వినాయకుడు.. విఘ్నాలను తొలగించే అధినాయకుడిగా పేరొందాడు. ఆంధ్ర రాష్ట్ర లోనే మహిమాన్విత మైన ఈ గణనాధుడు గోదావరి నదీ పరివాహక ప్రాంతం లో వెలిసి భక్తుల కష్టాలు తీర్చే స్వామి . గోదావరి జిల్లాల్లో , కోనసీమ ప్రాంతములో అయినవిల్లి గణపతిని తల్చుకుని ఏ పని ప్రారంబించిన దిగ్విజయంగా జరిగిపోతుందని భక్తుల నమ్మకం. ఆ స్వామికి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడం ఇక్కడివారికి ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. పవిత్ర గోదావరి, వైనతేయ నదుల మధ్య విస్తరించిన కోనసీమలో వృద్ధ గౌతమి, మధ్య గౌతమి పాయల మధ్య ఈ అయినవిల్లి వినాయకుని ఆలయం ఉంది .
![]() |
| అయినవిల్లి లో వినాయకుడు |
ఆలయ చరిత్ర
దక్షప్రజాపతి ద్రాక్షారామంలో దక్షయజ్ఞం పునఃప్రారంబించే ముందు అయినవిల్లి వినాయకుడిని పూజించి పునీతుడైనట్టు పురాణాలు చెబుతున్నాయి. వ్యాసమహర్షి తన దక్షిణ యాత్ర ఆరంభించే ముందు అయినవిల్లిలో వినాయకుడుని ప్రతిష్ఠించి పూజలు చేశాడని చెబుతారు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవిని అమె తండ్రి అయిన దక్షుడు అవమానించడంతో ఆ అవమాన భారాన్ని భరించలేక ఆమె యోగాగ్నిని రగుల్చుకుని దేహత్యాగం చేసింది. శివుడు రౌద్రావేశంతో ఒక జఠాజూటం నేలకు విసిరికొట్టాడు, దాని నుంచి వీరభద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
దక్షుడిని, దక్షయజ్ఞాన్ని అంతంచేయమని పరమ శివుడు వీరభద్రుడిని ఆదేశించాడు. దేవతలంతా దక్షుడిని బతికించమని వేడుకున్నారు. దక్షుడు దక్షయజ్ఞం ప్రారంభించే ముందు గణపతిని పూజించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భావించి వెంటనే అయినవిల్లి సిద్ధివినాయకుడుని పూజించి దక్షయజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడని పురాణాలుచెబుతున్నాయి.
ఆలయ దర్శనం
సాధారణంగా అన్ని ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ అయినవిల్లిలో మాత్రం సిద్ధివినాయకుడు దక్షిణముఖంగా వెలిశాడు. ఈ ఆలయానికి రెండు గోపురాలు, రెండు సింహద్వారాలు ఉంటాయి. దక్షిణ సింహద్వారం గుండా విఘ్నేశ్వరుడిని దర్శించు కోవాలి. తూర్పుగోపురం ద్వారా ప్రవేశించి క్షేత్రపాలకులను దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవస్వామి, అన్నపూర్ణదేవి, శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయాలు ప్రతిష్ఠించబడ్డాయి. క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ప్రతిష్టించబడ్డాడు.
సిద్ధిగణపతి ఆలయం మూడు భాగాలు ఉంటుంది. గర్భాలయం, అంతరాలయం, ముఖమండపాలుగా ఇవి విభజించబడ్డాయి. అంతరాలయం నేల మట్టానికన్నా లోతులో ఉంటుంది. గర్భాలయంలో నాలుగు అడుగులు ఎత్తైన స్వయంభూగణపతి భక్తులను అమితంగా ఆకర్షిస్తాడు. అంతరాలయంలోని కాంస్య మూషికం భక్తులను ఆకట్టుకుంటుంది. ముఖమండపంలో నల్లరాతిపై మలచబడిన ఎత్తైన మూషికం కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
అయినవిల్లి గణపతి అభిషేక ప్రియుడు. స్వామికి నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఆలయంలో నిత్యం లక్ష్మీగణపతి హెూమం కూడా నిర్వహిస్తారు. ప్రతీ నెల ఉభయ చవితి, దశమి, ఏకాదశి తిధుల్లో వినాయక చవితి పర్వదినాల్లో విశేష పూజలు జరుపుతారు. ప్రతీనెల లక్ష దూర్వార్చన (గరిక) పూజ చేస్తారు.
ప్రతీయేటా వినాయక చతుర్దికి వివిధ రకాల పండ్ల రసములతోస్వామివారికి శ్రీ రుద్రాభిషేకం జరిపిస్తారు. ఈ అభిషేకం చేయించు కోవడం వల్ల సర్వపాపములు, సర్వ రోగముల నుంచి విముక్తి లభిస్తుంది. అశ్వర్యాలు లభిస్తాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.
ఉత్సవాలు ప్రతీయేటా మాఘ శుద్ధ సప్తమి పర్వదినం నాడుస్వామివారికి సప్త నదీ జలములతో శ్రీరుద్రాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేయించుకోవడం వల్ల సర్వ పాపములు, సర్వ రోగముల నుంచి విముక్తి లభిస్తుంది. అష్టశ్వర్యాలు లభిస్తాయి. సంతాన ప్రాప్తి కలుగు తుంది. కోర్కెలు నెరవేరుతాయి, మోక్షంలభిస్తుంది.
ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 3, 4 వారాల్లో చదువుల పండుగ నిర్వహిస్తారు. వ్యాసమహర్షి భారతంను రచించేటప్పుడు ముందుగా విద్యాబలం గల శ్రీ విఘ్నేశ్వరుడిని స్తుతిస్తూ ఒక శ్లోకం రాయడమేకాదు, గణపతి పూజతో ఆ పని ప్రారంభించాడు. ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోయింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని అయినవిల్లి గణపతి ఆలయంలో చదువుల పండగ నిర్వహిస్తారు. లక్ష కలములతో స్వామి వారిని పూజించి ఆ కలములను విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు.
ప్రతి రోజు ఈ ఆలయం లో నిత్య అన్న దానము జరుగుతుంది .
ఎలా చేరుకోవాలి :
అయినవిల్లి చేరుకోవాలంటే అమలాపురం నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
రామచంద్రాపురం నుండి వచ్చే వారు కోటిపల్లి రేవు దాటి ముక్తేశ్వరం మీదుగా ఆటో లు లేదా , సొంత వాహనాలలో అయిన విల్లి చేరుకోవచ్చు .
రాజమండ్రి నుండి 55 కిమీ , రావులపాలెం నుండి 46 కిమీ , కాకినాడ నుండి 57 కిమీ , అమలాపురం నుండి 21 కిమీ దూరం లో అయినవిల్లి ఉంది .
మీరు వీలు చూసుకుని కొనసీమ లోని ఈ వినాయకుని దర్శించి తరించండి !










